Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 30

Fulfilling a Gurus's wish !

With Sanskrit text in Telugu , Kannada and Devanagari,

అథ తౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రవరిందమౌ |
దేశే కాలే చ వాక్యజ్ఞానబ్రూతాం కౌశికం వచః ||

తా|| అప్పుడు దేశకాలజ్ఞానముగలవారు, దేశకాలానుగుణముగా మాట్లాడ గలవారు , శత్రుసంహారములో దక్షులు అయిన ఆ రాజకుమారులు విశ్వామిత్రునితో ఇట్లనిరి.

బాలకాండ
ముప్పదియవ సర్గము

( రామలక్ష్మణులు విశ్వామిత్రుని యాగము సుబాహు మారీచాదిరాక్షసుల దాడినుంచి సంరక్షించుట)

అప్పుడు దేశకాలజ్ఞానముగలవారు, దేశకాలానుగుణముగా మాట్లాడ గలవారు , శత్రుసంహారములో దక్షులు అయిన ఆ రాజకుమారులు విశ్వామిత్రునితో ఇట్లనిరి.

'ఓ భగవన్ ! ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నము కలిగించుటకై ఎప్పుడు వచ్చెదరో వినుటకు కోరికాగనున్నది. యజ్ఞ సంరక్షణార్థము మేము సావధానులమై యుందుము'.

ఈ విధముగా పలుకుచూ ఆ కాకుస్థులిద్దరూ యుద్ధముచేయుటకు సిద్ధపడుచుండిరి. అప్పుడు ఆ మునులందరూ మిక్కిలి ప్రీతితో ఆ నృపాత్ముజులను ప్రశంసించుచూ ఇట్లనిరి. ' ఓ రాఘవా ! ఈ దినమునుంచి ఆరు రాత్రులు మీరు రక్షణాకార్యములో నుందురుగాక. ఈ మహాముని దీక్షలోనూ మౌనవ్రతములోనూ ఉండును'.

యశోవంతులగు ఆ రాజకుమారులిద్దరూ నిద్రలేకుండా అహో రాత్రులు తపోవనుడైన ఆ విశ్వామిత్రుని ను రక్షించుచుండిరి. మహాధనుర్దారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపముననే నిలచి ముని వరుని రక్షణా కార్యక్రమములో నిమగ్నులై ఉండిరి. ఆ విధముగా ఇదు దినముల కార్యక్రమము ముగిసెను. ఆరవ రోజు రాగానే శ్రీరాముడు లక్ష్మణునితో, 'నీవు సర్వ సన్నద్ధుడివిగా యుండుము' అని చెప్పెను. శ్రీరాముడు ఈ విధముగా అనుచుండగనే ఆ వేదికనుండి అగ్ని జ్వాలలు పైకి లేచెను. దర్భలు , చమసములు, స్రుక్కులు , సమిధలు, పుష్పముల తోనూ అలాగే విశ్వామిత్రుడు ఋత్విజులతో కూడిన ఆ యజ్ఞవేదిక ఒక్కసారిగా జ్వాలలతో ప్రజ్వరిల్లెను. యజ్ఞము వేదమంత్ర పూర్వకముగా యథాక్రమముగా కొనసాగుచుండెను. అప్పుడు ఆకాసమునుండి భయంకరమైన మహాశబ్దము బయలుదేరెను. వర్షా కాలపు ఆకాశమునందుండు మేఘములవలె రాక్షసులు తమతమ మాయలను ప్రదర్శించుచూ పరుగుపరుగున వచ్చిరి.

మారీచుడు సుబాహువు తమ తమ అనుచరులతో వచ్చి కుండపోతగా రక్తవర్షమును కురిపించిరి. ఆ రక్త వృష్టితో వేదికయొక్క పరిసరములు తడిసిపోయెను. తమ్మునితో గూడిన శ్రీరాముడు వెంటనే ఆ వేదికను చూచి క్రుద్ధుడై ఆకాసమునవున్న రాక్షసులను చూచెను.

రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణునివేపు చూచి సాభిప్రాయముగా ఇట్లు పలికెను. 'ఓ లక్ష్మణా! వాయువు మేఘముల వలె నున్న మాంసబక్షకులు దుర్మార్గులు అయిన ఈ రాక్షసులను మానవాస్త్రముతో చెల్లా చదురుగ చేసెదను చూడుము. ఇట్టి పిరికిపందలను సంహరించుటకు ఏమాత్రము ఇష్ట పడను' . అని పలికిఅ శ్రీరాముడు తన శరమును బంధించెను.

అప్పుడు ఆ రాఘవుడు మిక్కిలి క్రుద్ధుడై మిక్క్కిలి శక్తిమంత మైనది కాంతులను విరజిమ్ముచున్నది అగు మానవాస్త్రమును మారీచుని వక్ష స్థలముపై ప్రయోగించెను. ఆ మారీచుడు ఆ అమోఘమైన మానవాస్త్రము దెబ్బకి నూరుయోజనములదూరమున సముద్ర జలములలో పడిపోయెను. ఆ శీతేషు అను శరాఘాతమునకు గురి అయి స్పృహను కోలుపోయి, గిరగిరా తిరిగి దూరమునకు కొట్టుకుపోవుచున్న మారీచుని చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను." ఈ దుర్మార్గులను వధించెదను. వీరు కఠినాత్ములు, పాపాత్ములు, యజ్ఞములను ధ్వంసము చేయువారు రక్తము త్రాగువారు".

పిమ్మట శ్రీరాముడు అద్భుతము , దివ్యము అయిన అగ్నేయాస్త్రమును సంధించి సుబాహువుని కొట్టెను. ఆ బాణముతో అతడు నేలపై కూలెను. అప్పుడు మిక్కిలి పరాక్రమవంతుడైన శ్రీరాముడు వాయవ్యాస్త్రముతో మిగిలిన రాక్షసులను వధించి మునులకు సంతోషము కూర్చెను. ఈ విధముగా ఆ రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నము కలిగించు రాక్షసులను హతమార్చి పూర్వకాలములో విజయము పొందిన ఇంద్రునివలె మునివరుల పూజలను అందుకొనెను.

యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను. అన్ని దిశలనుండి బాధలు తొలగిపోయెను. అది చూచి విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇట్లనెను.

'ఓ మహాబాహో ! కృతార్థుడనైతిని. నీవు గురువచనములను పాటించినావు. ఓ రామా ! 'సిద్ధాశ్రమమను పేరు సార్థకమైనది. ఈ చర్యతో నీ ఖ్యాతి ఇనుమడించినది' అని

||ఈ విధముగా బాలకాండలోని ముప్పదియవ సర్గ సమాప్తము||
||ఓమ్ తత్ సత్ |

కృతార్థోస్మి మహాబాహో కృతం గురువచస్తయా |
సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః ||

తా|| 'ఓ మహాబాహో ! కృతార్థుడనైతిని. నీవు గురువచనములను పాటించినావు. ఓ రామా ! 'సిద్ధాశ్రమమను పేరు సార్థకమైనది. ఈ చర్యతో నీ ఖ్యాతి ఇనుమడించినది' అని
||ఓమ్ తత్ సత్ ||

||om tat sat ||